భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరి

Ammiraju Udaya Shankar.sharma News Editor…సింగిల్ విండో విధానంలో అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం

ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం

జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు

జిల్లాలో వినాయక మండపాలు, విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం, సరళతరం చేస్తూ ఆన్‌లైన్ ‘సింగిల్ విండో’ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ విధానం ద్వారా పోలీస్, ఫైర్, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అనుమతులను ఒకే చోట, పూర్తిగా ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:

👉 నిర్వాహకులు https://ganeshutsav.net/ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ముందుగా మొబైల్ నంబర్ నమోదు చేసి, OTP ద్వారా అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించాలి.

👉 ఫారమ్‌లో కోరిన వివరాలు పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించాలి.

👉 దరఖాస్తు పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అనుమతులు మంజూరు చేస్తారు.

👉 అనుమతి పొందిన తర్వాత QR కోడ్‌తో కూడిన డిజిటల్ NOC ను అదే పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని, మండపం వద్ద ప్రదర్శించాలి.

దరఖాస్తుకు కావాల్సిన వివరాలు:

👉 ప్రధాన నిర్వాహకుడి ఆధార్, చిరునామా వివరాలు.

👉 కమిటీకి చెందిన ఐదుగురు బాధ్యతాయుతమైన సభ్యుల పేర్లు, మొబైల్ నంబర్లు.

👉 మండపం ఏర్పాటు చేసే స్థలం వివరాలు, స్థల యజమాని అనుమతి పత్రం లేదా స్థానిక సంస్థల NOC.

👉 మండపం, విగ్రహాల పరిమాణం

👉 తాత్కాలిక విద్యుత్ సరఫరా అనుమతి వివరాలు.

👉 నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, ఊరేగింపు మార్గం మరియు ఉపయోగించే వాహనం వివరాలు.

భద్రత మరియు నిర్వహణ నిబంధనలు:

👉 మండపాలు ప్రజల రాకపోకలకు, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు.

👉 మండపాల వద్ద తగినంత వెలుతురు, విద్యుత్ భద్రత, అగ్నిమాపక పరికరాలు, పారిశుధ్య ఏర్పాట్లు ఉండాలి. ముఖ్యమైన మండపాల వద్ద CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించాలి.

👉 లౌడ్‌స్పీకర్లు, DJలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 06:00 గంటల వరకు మైకులు/లౌడ్‌స్పీకర్లు ఉపయోగించరాదు.

👉 ఊరేగింపుల సమయంలో పోలీస్ శాఖ సూచించిన మార్గాలు, సమయాలను మాత్రమే పాటించాలి.

నిమజ్జన సమయంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు:

👉 అధికారికంగా గుర్తించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం నిర్వహించాలి.

👉 నదులు, కాలువలు, చెరువులు, తాగునీటి వనరులు వంటి నిషేధిత ప్రాంతాల్లో అనధికారిక నిమజ్జనాలు పూర్తిగా నిషిద్ధం.

👉 నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, ప్రత్యేక ప్రవేశ – నిష్క్రమణ మార్గాలు, లైఫ్ జాకెట్లు, రక్షణ పడవలు, శిక్షణ పొందిన ఈతగాళ్లు, అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ సిబ్బంది అందుబాటులో ఉంటారు.

హెచ్చరిక:
శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అనధికారిక మార్గాల్లో ఊరేగింపులు నిర్వహించినా, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.

పర్యావరణ పరిరక్షణ:
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరిస్తూ, నియమ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, ఆనందకర వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.