భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈవారంలో 4 రోజులు బ్యాంకులు బంద్

వచ్చే వారంలో నాలుగు రోజుల బంద్
రక్షాబంధన్, ఈద్ పండుగల సెలవులు
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో
Bank Holidays: ఈ వారంలో బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునే వినియోగదారులకు కీలక హెచ్చరిక సమాచారం.

పండుగలు, వరుస సెలవుల కారణంగా ఈవారంలో మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, ఈద్-ఎ-మిలాద్ వంటి ప్రధాన పండుగల సందర్భాలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు శాఖల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కాబట్టి వినియోగదారులు తమకు సంబంధించి ఏవైనా అత్యవసర బ్యాంకు పనులు, భౌతిక లావాదేవీలు ఉంటే సోమవారంలోపే(ఆగస్టు 24) పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఆగస్టు 25 నుంచి 30 వరకు సెలవుల వివరాలు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బ్యాంకులు(Bank Holidays) మూసి ఉంటాయి. ఆగస్టు 26న ఈద్-ఇ-మిలాద్ కారణంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. చివరగా ఆగస్టు 30న సాధారణ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకింగ్ శాఖలు బంద్ అవుతాయి.

డిజిటల్ సేవలు యథాతథం, ఆన్‌లైన్ లావాదేవీలకు ఇబ్బంది లేదు:

బ్యాంకు శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ, ఖాతాదారులు డిజిటల్ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, UPI లావాదేవీలు, RTGS, NEFT, ATM సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కుల క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్లు, లోన్ డాక్యుమెంట్ల పరిశీలన, భౌతిక బ్రాంచ్ ఆధారిత పనులన్నీ ఈ నాలుగు రోజులలో నిలిచిపోతాయి. కాబట్టి వినియోగదారులు తమ ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరం.