భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…తేలు కుడితే చల్లటి కాపడం పెట్టండి!
పాము కంటే తేలు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందు ఉంది; తేలు విషానికి విరుగుడు మందు లేదు. విరుగుడు లేదు కాబట్టి ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. తేలు కుట్టినప్పుడు వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం.
తేలు నొప్పి ప్రత్యేకత
తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా, చెప్పనలవి కాని విధంగా ఉంటుంది.
విపరీతమైన నొప్పిగా ఉంటుంది
తిమ్మిరిగా ఉంటుంది
పైకి పాకుతున్నట్టుగా ఉంటుంది
వీటన్నింటి కలయికగా కూడా ఉంటుంది
సాధారణంగా నొప్పి నివారణకు వాడే సూదిమందులకు కూడా ఈ నొప్పి త్వరగా లొంగదు. కానీ చల్లటి కాపడంతో నొప్పిని చాలావరకు తగ్గించవచ్చు.
చల్లటి కాపడం ఎలా పెట్టాలి?
ఐసు ముక్కలను గుడ్డలో గానీ, ప్లాస్టిక్ కవరులో గానీ, లేదా గ్లాసులో వేసి గానీ తేలు కుట్టిన చోట కాపడం పెట్టాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు పెట్టి తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాల పాటు కాపడం పెట్టాలి. ఇలా రెండు గంటల పాటు కొనసాగిస్తూనే రోగిని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.
వైద్యుని దగ్గరకు తీసుకెళ్లే లోపు మరో రెండు పనులు చేయడం మంచిది:
తేలు కుట్టిన శరీర భాగం గుండె కంటే దిగువన ఉండేలా చూసుకోవడం. కుట్టిన భాగాన్ని గుండె కంటే తక్కువ ఎత్తులో ఉంచితే విషం గుండెకు చేరడం ఆలస్యమై, ప్రమాద తీవ్రత తగ్గుతుంది.
తేలు కుట్టిన భాగంలో బిగుతుగా ఉండే మెట్టెలు, ఉంగరాలు, గజ్జెలు, గాజులు లాంటి ఆభరణాలను వెంటనే తీసివేయాలి. లేదంటే వాపు ఎక్కువై ఆ భాగానికి రక్తప్రసరణ ఆగిపోయి, వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
ఈ ప్రాథమిక వైద్యం అందిస్తూనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.
