..భారత్ న్యూస్ అమరావతి..జగన్‌ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం..

దిల్లీ: వైకాపా అధ్యక్షుడు జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghu rama krishna raju) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది..

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్‌ నుంచి మార్చాలని తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది.

సీజేఐ ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సభ్యుడిగా ఉన్నారు. విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అని జగన్‌ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ తెలిపారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. ఈ క్రమంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబర్‌ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.