భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పెరోల్ పై వెళ్లి.. ప్రభుత్వ టీచర్‌గా రిటైరై.. 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు 1983లో వరంగల్‌ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. 1984 మార్చి 18న జైలులో లొంగిపోవాల్సి ఉన్నా తిరిగి వెళ్లలేదు.

అక్కడి నుంచి ఏకంగా 40 ఏళ్ల 58 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా మహబూబాబాద్‌ జిల్లాలోనే జీవించాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి, 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకున్నాడు. 2013లో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు.

అయితే 2024 మే 16న వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

తనకు మూడేళ్ల పాటు పెరోల్‌, జైలు శిక్ష మినహాయింపు ఇవ్వకుండా జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వీరన్న భార్య హైకోర్టును ఆశ్రయించారు. 40 ఏళ్లుగా మహబూబాబాద్‌లోనే అందుబాటులో ఉన్న వ్యక్తిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

అయితే ఈ వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. వీరన్న ఉద్దేశపూర్వకంగానే జైలుకు తిరిగి వెళ్లకుండా తప్పించుకు తిరిగారని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ ఘటనపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. జైళ్ల శాఖ నిర్లక్ష్యానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని వ్యాఖ్యానించింది.