అవనిగడ్డలో టీడీపీ శ్రేణులకు ‘సర్’ పై అవగాహన సదస్సు

భారత్ న్యూస్ విజయవాడ…అవనిగడ్డలో టీడీపీ శ్రేణులకు ‘సర్’ పై అవగాహన సదస్సు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై శ్రేణులకు దిశానిర్దేశం

హాజరైన జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు,రాష్ట్ర పార్టీ ప్రతినిధి గవిని సతీష్

అవనిగడ్డ: స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీశ్రేణులకు’సర్’ (ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ) పై నియోజకవర్గ స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయ ప్రతినిధి గవిని సతీష్ క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు పూర్తి అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పూర్తి పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి ఏజెంట్లు (BLA), క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుండి తొలగింపునకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నూతన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరియు బూత్ స్థాయి ఓటర్ల జాబితా పరిశీలనపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.